సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు దసరా పండుగ ముందే వచ్చేసింది. గతంలో చెప్పినట్లుగానే వారందరికీ ఒకేసారి ఏరియర్స్ చెల్లించారు. అందుకు సంబంధించి 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ కింద రూ. 1450 కోట్లను డైరెక్టర్ ఎన్. బలరామ్ విడుదల చేశారు. దీంతో ఒక్కో కార్మికుడికి దాదాపుగా రూ. 4 లక్షల మేర ఏరియర్స్ అందే అవకాశం ఉంది. ఈ విధంగా దాదాపు 40 వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. సీఎం కేసీఆర్, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రత్యేకత చొరవతో పాటు నాయకుల కృషితో కార్మికులకు ఏరియర్స్ బకాయిలు ఒకేసారి అందనున్నాయి. చైర్మన్ ఆదేశాల ప్రకారం.. కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో యాజమాన్యం గురువారం మధ్యాహ్నం నిధులు జమ చేసింది. ఏరియర్స్ చెల్లింపుపై సింగరేణి ఎండీ శ్రీధర్ మరియు డైరెక్టర్ బలరామ్లకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త
కార్మికులకు ఏరియర్స్ విడుదలపై సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్. బలరామ్ మాట్లాడారు. త్వరలో దసరా, దీపావళి బోనస్ల చెల్లింపునకు కూడా సింగరేణి సంసిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం 39,413 మంది ఉద్యోగులకు ఏరియర్స్ కింద రూ. 1450 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన తెలిపారు. సగటున ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల అందాయన్నారు.