Saturday, May 11, 2024

సినీ ఫక్కీలో రూ. 15 లక్షల మోసం

spot_img

రూ. 10 కోట్ల విరాళమిస్తామంటూ ట్రస్ట్ ప్రతినిధిని పిలిచి, అతని నుంచి రూ. 15 లక్షలు కొట్టేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన నిజాంపట్నం అమరేంద్ర (47) ఆర్ఎంపీ వైద్యుడిగా పని చేస్తుంటాడు. రూరల్ డెవలప్మెంట్ హెల్త్ సొసైటీ ట్రస్ట్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే అమరేంద్రకు ఇటీవల వెంకటేశ్వర రావు, శ్రీనివాసరావు అనే వ్యక్తుల ద్వారా భరత్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు తెలిసిన అనేక మంది దాతలు పలు స్వచ్ఛంద సంస్థలకు కోట్లాది రూపాయలు విరాళాలుగా ఇస్తుంటారని నమ్మ బలికాడు. ఒక అజ్ఞాత దాత రూ.10కోట్ల విరాళాన్ని రూరల్ డెవలప్మెంట్ హెల్త్ సొసైటీ ట్రస్ట్ కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఈ మొత్తాన్ని ఇప్పించాలంటే తనకు రూ.15 లక్షలు కమీషన్ గా ఇవ్వాల్సి ఉంటుందని భరత్ రెడ్డి చెప్పాడు. ఈనెల 25న బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ కు వస్తే అక్కడే డీల్ కుదిరిస్తానని చెప్పడంతోపాటు అక్కడే ఓ గది కూడా బుక్ చేశాడు. అక్కడికి చేరుకున్న అమరేంద్రను కలిసిన భరత్ రెడ్డి, అతని స్నేహితుడు నాగరాజుతో కలిసి రూమ్ నం.422 లోకి వెళ్లారు. రూ.10 కోట్ల విరాళం ఇచ్చే దాతతో చర్చలు జరుగుతున్నాయని, రూ.15లక్షల కమీషన్ లాకర్‎లో పెట్టాలని చెప్పాడు. తాను కూడా రూ. 15 లక్షలు అదే లాకర్ లో పెడుతున్నానని, రూ.10కోట్ల డీల్ కుదిరిన తర్వాత లాకర్ ఓపెన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. చర్చల కోసం తాను బయటకు వెళ్తున్నానని, నాగరాజు అదే గదిలో ఉంటాడని చెప్పి భరత్ రెడ్డి బయటకు వెళ్లి పోయాడు. మరుసటి రోజు ఉదయం నాగరాజు కూడా పని ఉందంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన అమరేంద్ర పార్క్ హయత్ హోటల్ యాజమాన్యం సాయంతో లాకర్ ఓపెన్ చేసి చూడగా.. తాను పెట్టిన రూ.15 లక్షలతో పాటు భరత్ రెడ్డికి చెందిన రూ.15లక్షలు కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా సీక్రెట్ కోడ్ పేరుతో తనను మోసం చేయడంతోపాటు డబ్బులతో ఉడాయించారని గుర్తించిన అమరేంద్ర.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భరత్ రెడ్డి, నాగరాజు మీద ఐపీసీ 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

More Articles