సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి నలుగురిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్లో నష్టం రావడంతో నిందితులు ఈ డ్రగ్స్ దందాలోకి దిగినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ‘చింతా రాకేష్ అనే వ్యక్తి ఈ ముఠాకి కింగ్ పిన్. డ్రై ఫ్రూట్ బిజినెస్లో లాస్ రావడంతో.. డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. రాకేష్ కింద మరో ఇద్దరు డ్రగ్ పెడ్లర్లుగా పనిచేస్తున్నారు. గోవాలో నైజీరియన్తో పరిచయాలు పెంచుకొని, అక్కడి నుంచి కొకైన్ తెచ్చి రాకేష్ ఇక్కడ సప్లై చేస్తున్నాడు. గోవాలో 7 వేలకు గ్రామ్ కొని… హైదరాబాద్లో 18 వేలకు అమ్ముతున్నాడు. A4గా ఉన్న సూర్య ప్రకాష్ని పట్టుకోవడంతో ఈ ముఠా గురించి బయటపడింది. నిందితులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేస్ నమోదైంది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా.. A2గా ఉన్న నైజీరియన్ గాబ్రియల్.. నైజీరియాకి వెళ్ళిపోయాడు. వీరి నుంచి ఒక కోటి 33 లక్షల విలువైన 303 గ్రామ్స్ కొకైన్ సీజ్ చేశాం. రెండు కార్లు, 5 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం. వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఈ ముఠా సంప్రదిస్తుంది. హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలు అరేంజ్ చేసి, కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. నిందితుల వాట్సాప్ చాట్లో కొంతమంది ప్రముఖ వ్యారవేత్తలు కూడా ఉన్నారు. కస్టమర్స్ ఎవరో గుర్తించే పనిలో ఉన్నాం, వారికి కూడా నోటీసులు ఇస్తాం. NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం కష్టమర్స్కి నోటీసులు ఇవ్వబోతున్నాం.