ప్రేమించి, పెళ్లిచేసుకోవాలని అడిగినందుకు యువతిని ఓ పూజారి హత్యచేసిన కేసులో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును పోలీసులు తెలియజేశారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ, అప్సర మధ్య పరిచయం ఉంది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసెజ్ చేసేవాడు. నవంబర్లో ఇద్దరూ కలిసి గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సందర్శించారు. ఆ ట్రిప్ తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. ఈ క్రమంలోనే అప్సర.. వాట్సాప్ ద్వారా లవ్ ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ శారీరకంగా కలిశారు. కొన్నాళ్ల తర్వాత అప్సర పెళ్లి చేసుకోమని సాయికృష్ణను ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో అప్సరను అడ్డు తొలగించుకునేందుకు సాయి కృష్ణ హత్యాపథకం వేశాడు. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో శోధించాడు.
‘How to Kil human being’ అని గూగుల్లో సాయి కృష్ణ వెతికాడు. తనను కోయంబత్తూర్కు తీసుకెళ్లాలని గతంలో అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. దాంతో అప్సరను చంపేందుకు కోయంబత్తూర్ టూర్ను ఉపయోగించుకున్నాడు. కోయంబత్తూర్కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించి జూన్ 3న కారులో సరూర్ నగర్లోని ఆమె ఇంటినుంచి బయటకు తీసుకొచ్చాడు. రాత్రి 8:15 నిమిషాలకు సరూర్ నగర్ నుంచి ఇద్దరూ కారులో బయలుదేరి, 9 గంటలకు శంషాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని అప్సరతో చెప్పాడు.
సుల్తాన్ పల్లిలోని గోశాలకి వెళ్తున్నట్టు చెప్పాడు. మధ్యలో డిన్నర్ కోసం రాల్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆగారు. అప్పటికే అప్సర ఒకసారి వాంతి చేసుకోవడంతో ఏమీ తినలేదు. సాయికృష్ణ మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డిన్నర్ చేశాడు. అనంతరం 12 గంటలకి సుల్తాన్ పల్లిలోని గోశాల వద్దకు చేరుకున్నారు. కాసేపటి తర్వాత 3:50 గంటలకు వెంచర్ సైడ్ వెళ్లారు. అక్కడ కారులో నిద్రిస్తున్న అప్సరను తలపై కొట్టి హత్యచేశాడు.