నంద్యాల జిల్లా: శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడవరోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి రావణవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైల ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది.
ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.
Also Read.. 700కి పైగా శవపరీక్షలు.. అరుదైన మహిళకు రామాలయ ఆహ్వానం
అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా రావణ వాహనాదీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు.
రావణ వాహానంపై స్వామి అమ్మవార్లు క్షేత్రపురవిధుల్లో విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు భక్తులు పాల్గొన్నారు.