ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విచారణ ఇవాళ(మంగళవారం) సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఆరోగ్యకారణాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత జైన్కు మంజూరైన బెయిల్ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించింది. సత్యేందర్ జైన్ ను విచారించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. మే 2022లో మనీలాండరింగ్ కేసులో జైన్ను ED అరెస్టు చేయగా.. ఈ ఏడాది ప్రారంభంలో అతనికి వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరైంది.
విచారణను వాయిదా వేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి. రాజు అభ్యర్థించడంతో న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం జైన్కు ఈ రిలీఫ్ ను ఇచ్చింది. జైన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా కేసు విచారణను వాయిదా వేసేందుకు అంగీకరించడంతో కోర్టు సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. అంతకుముందు మే 26న, వెన్నెముక శస్త్రచికిత్స కోసం జైన్కు సుప్రీంకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జూలై 24న మధ్యంతర బెయిల్ను మరో 5 వారాలు పొడిగించింది.