హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు కలిపి ఒకే దరఖాస్తు రూపొందించినట్లు తెలిపారు.
ఈ నెల 28 నుంచి ఈ పథకాలకు గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 7వ తేదీ లోపు లబ్దిదారుల వివరాలు సేకరిస్తామన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వాందరికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. రైతుబంధుకు ఎలాంటి పరిమితి విధించలేదని సీఎం స్పష్టం చేశారు.
ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని, గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యులను నియమిస్తామన్నారు. గ్రూప్-2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.