Sunday, May 19, 2024

స్నేహితుల కోసం జిల్లా టాపర్ స్మార్ట్ కాపీయింగ్.. పట్టుబడ్డ నలుగురు మిత్రులు

spot_img

స్నేహితుల కోసం జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్‎కు పాల్పడిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్‌ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైటెక్‌ సిటీలో ఉన్న ఓ కార్పొరేట్‌ కాలేజ్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరయ్యారు. వీరికి ఎల్‌బీనగర్‌, మల్లాపూర్‌, మౌలాలి, సికింద్రాబాద్‌ కేంద్రాలలో సెంటర్ పడింది. వీరిలో ఓ విద్యార్థి కడప జిల్లాకు చెందినవాడు. ఇతను పదో తరగతి, ఇంటర్‎లో జిల్లా టాపర్. తన స్నేహితుల కోసం స్మార్ట్ కాపీయింగ్‎కు తెరలేపాడు. నలుగురు కలిసి ఓ వాట్సాప్ గ్రూన్ క్రియేట్ చేసుకొని, తమ స్మార్ట్ ఫోన్లతో పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. పరీక్ష ప్రారంభం కాగానే.. కడప విద్యార్థి గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సమాధానాలను స్క్రీన్‌ షాట్‌ తీసి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు.

సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని ఎస్‌వీఐటీ కాలేజ్‌లో పరీక్ష రాసి, గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సమాధానాల స్క్రీన్‌ షాట్‌ను వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. ఎల్‌బీనగర్‌, మల్లాపూర్‌, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు. ఈ క్రమంలోనే.. ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్‌ ఈ బాగోతాన్ని గమనించి ఆ విద్యార్థిని పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా మొత్తం తతంగమంతా బయటపడింది. వెంటనే ఆ కేంద్రంవారు హైదరాబాద్‌ ఐఐటీ అధికారులకు సమాచారం అందించారు. వారు సికింద్రాబాద్‌ ఎస్‌వీఐఈ సెంటర్‌లో విధుల్లో ఉన్న అబ్జర్వేటర్‌కు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన అబ్జర్వేటర్‌ వెంటనే వెళ్లి తనిఖీ చేయగా విద్యార్థి వద్ద స్మార్ట్‌ ఫోన్‌ లభించింది. దీంతో ఆ పరీక్షా కేంద్రం అధికారులు మార్కెట్‌ పోలీసులకు సమాచారం అందించి విద్యార్థిని అప్పగించారు. అతడిపై మార్కెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సికింద్రాబాద్‌ ఎస్‌వీఐటీ సెంటర్‌లో పట్టుబడిన ఆ తెలివైన విద్యార్థిది కడప జిల్లా. ఎస్‌ఎస్‌సీలో 600/600 మార్కులు, ఇంటర్‌లో 940/1000 మార్కులు సాధించాడు. ఇంత తెలివైన విద్యార్థి.. స్నేహితుల కోసం తన భవిష్యత్తును అంధకారం చేసుకున్నాడని అతడి బంధువు ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరీక్ష నిర్వహణను హైదరాబాద్‌ ఐఐటీ ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. విద్యార్థి స్మార్ట్‌ఫోన్‌ను పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లడాన్ని సదరు సంస్థ గమనించలేదు. పరీక్ష హాల్‌ పెద్దగా ఉండడం.. ఇన్విజిలేటర్‌ ఎక్కడో ఒక చోట కూర్చుని ఉండడం వల్లనే ఫోన్‌లో జవాబులను తమ వాట్సాప్‌ గ్రూపునకు పంపడం సులువైందని పట్టుబడ్డ విద్యార్థి చెబుతుండడం గమనార్హం.

Latest News

More Articles