అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేర్వేరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది.
దీనికి తాము బాధ్యులం కాదని సీబీఐ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. లోయర్ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని అన్నారు. దీంతో, మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధం దర్యాప్తు సంస్థకు కాకపోతే మరెవరికి ఉంటుందని అడిగింది.
ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్ లను వేగంగా విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిందని… ఆ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జగన్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. దీంతో, జగన్ కేసుల్లో విచారణ ఎంత త్వరగా ముగుస్తుందో చూద్దామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు