Saturday, May 18, 2024

21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలు..

spot_img

తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు కొనసాగనున్నాయి. తొలి రోజు హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయంలో ప్రారంభిస్తారు. సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్‌ఓడీలు, ఉద్యోగులందరూ హాజరవుతారు. అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టియర్స్ డే’గా జరుపాలన్నారు. అమరుల స్మారక దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, విద్యుద్దీపాలతో వెలిగించి.. గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలని నిర్ణయించారు. అలాగే జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేయననున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డేలో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొంటాయి.

తెలంగాణ ప్రగతిపై డాక్యుమెంట్‌ ప్రదర్శన
మరో 20రోజుల పాటు వరుసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్‌ రూపంలో ప్రదర్శించాలి. వ్యవసాయం, విద్యుత్‌ శాఖ ఇలా ప్రతిశాఖ గురించి డాక్యుమెంట్‌ను, ఆయా శాఖలకు కేటాయించబడిన రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తారు. ప్రతిశాఖ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని కూలంకశంగా రికార్డు చేస్తూ అన్నిశాఖలకు శాఖల వారీగా ఒక్కో డాక్యుమెంట్‌ను ప్రదర్శించాలి. ఆయా శాఖలు దేశానికే ఆదర్శంగా సాధించిన ప్రగతిని, ఈ ప్రగతిసాధించడానికి వెనుక రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని దార్శనికతను, దృక్పథాన్ని, తాత్వికంగా విశ్లేషిస్తూ డాక్యుమెంటును రూపొందించి, సినిమా హాల్స్‌ టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి.

విద్యుత్‌శాఖకు కేటాయించిన రోజును పవర్ డే’ గా పరిగణిస్తూ.. ఆ రోజు విద్యుత్‌శాఖ సాధించిన విజయాల గురించి డాక్యుమెంటరీ ప్రదర్శన, తదితర సమాచారంతో ఆ రోజంతా విద్యుత్తు డే జరుపుకుంటారు. తాగునీరు, సాగునీరుకు సంబంధించి.. మొత్తంగా ఒకే రోజున ‘వాటర్‌ డే’ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సాగునీరు తాగునీరు, జలాభివృద్ధి జరిగిన తీరు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ దృక్పథం దార్శనికత, ఎంత కష్ట పడితే ఒకనాడు తాగునీటికి తల్లడిల్లిన తెలంగాణలో నేడు అడుగడుగునా జలధారలు పరవళ్లు తొక్కుతున్నాయనే అంశాల గురించిన అవగాహనపై ఒక రోజు కేటాయించాలి’ సీఎం కేసీఆర్‌ సూచించారు.

సంక్షేమంపై ‘వెల్ఫేర్‌ డే’ నిర్వహించాలి..
రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని రకాల అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించిన ‘వెల్ఫేర్‌’డేగా ప్రత్యేకంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ రోజున దళితబంధు అమలు, 125 ఫీట్ల డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం దగ్గర నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళా సహా పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యాచరణపై సమాచారాన్ని పలు మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిపేలా కార్యక్రమాలుండాలి. అగ్రికల్చర్‌ డే, పల్లె-పట్టణాభివృద్ధి డే, రూరల్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డే, రెవెన్యూ డే, పరిపాలన సంస్కరణ, పోలీస్‌ సంస్కరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపే దిశగా ‘ఉమెన్ డే, ఇండస్ట్రీస్ ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టీజన్స్ డే (వృత్తిపనులు), గ్రీన్ డే, హాండ్లూమ్ డే, ఆర్థిక ప్రగతి గురించి, మౌలిక వసతుల అభివృద్ధి తదితర శాఖలకు కేటాయించిన ఒక్కో రోజును ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు.

తెలంగాణ ప్రస్థానాన్ని ప్రపంచం తెలుసుకునేలా..
దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గురించి ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. స్వతంత్ర భారతంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన.. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీని రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన, ప్రభుత్వ పాలన ప్రారంభమైన 2 జూన్ 2014 నుంచి నుంచి 2023 జూన్ 2 దాకా స్వయం పాలనలో సాగిన సుపరిపాలన అది సాధించిన ప్రగతిని గురించిన మరో డాక్యుమెంటరీని రూపొందించాలి. 21 రోజుల పాటు తెలంగాణ సంబురాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా డి వంటలు ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపద తదితర సంగీత విభావరి, సినిమా జానపద తదితర కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపదం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

తెలంగాణ చారిత్రక కట్టడాల గురించి తెలిపేలా..
గోల్కొండ కోట, భువనగిరి కోట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలను, ప్రముఖ రామప్ప సహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను అందంగా అలంకరించడంతో పాటు విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా పటాకులతో వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలని, తమ తమ ఉద్యోగ విధుల్లో ప్రతిభ కనబరిచిన అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డులు అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 5నుంచి ఆరువేల మంది కళాకారులతో హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, ధూంధాం ర్యాలీ నిర్వహించాలని, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవ శోభ ప్రస్పుటించేలా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా ఉత్సవాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఈ కోసం సీఎం శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాలపై కమిటీ సమావేశమవుతూ.. ఉత్సవాల విధివిధానాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో మరింత చర్చిస్తూ ఇంకా ఏమైనా చేర్చదగ్గ అంశాలుంటే జతచేసి తుది రూపం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సమీక్షలో సీఎస్‌ శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్‌, డీజీపీ అంజనీకుమార్‌, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహదారులు రమణాచారి, అనురాగ్ శర్మ, సీఎం సెక్రెటరీలు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునిల్ శర్మ, సింగరేణి కాలరీస్ సీఎండీ శ్రీధర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest News

More Articles