దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ట్రెండ్ సెట్టర్గా మారిందని జార్ఖండ్ పాత్రికేయులు ప్రశంసించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. జార్ఖండ్ కంటే 14 ఏండ్ల తర్వాత ఆవిర్భవించిన తెలంగాణ, ప్రగతిలో తమ రాష్ట్రంకంటే, మాటకొస్తే దేశంకంటే వందేండ్లు ముందున్నదని కితాబిచ్చారు.
ఇక 16 మందితో కూడిన జార్ఖండ్ పాత్రికేయుల బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరు తెన్నులు, చట్టాల అమలు తదితర అంశాలపై క్షేత్ర పరిశీలన చేస్తున్నది. ఈ బృందం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడింది. ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తాను విజనరీ అని నిరూపించుకొన్నారని పాత్రికేయులు ప్రశంసించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావటంపై దేశవ్యాప్తంగా ఆసక్తి కర చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.