కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఉండాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రులు గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో 15 లక్షల అంచనా విలువతో నిర్మించిన జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ భవనాన్ని వారు ప్రారంభించారు.
ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలతో మేడారం జాతరను ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేడారం జాతర అభివృద్ధి పనులకు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి వరకు రూ.400 కోట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే మహా జాతరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కొంతమేర రోడ్లు దెబ్బ తిన్నాయని ఆయా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.