తెలంగాణలో 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ బాగోతం మీద 2017లో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇప్పడు జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ముందుకు వచ్చింది. దాంతో సుప్రీంకోర్టులో అక్టోబర్ 4న విచారణ జరగనున్నట్లు తెలిసింది. అప్పట్లో ఓటుకు నోటు వ్యవహారం రేవంత్ రెడ్డి చుట్టే తిరిగింది. ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా కెమెరాకు చిక్కారు.
Read Also: తెలంగాణ కాంగ్రెస్కు షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా
2015లో ఓటుకి నోటు కేసు నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్కు జరిగే ఎన్నికల్లో, ఒక నామినేటెడ్ శాసన సభ్యుడైన స్టీఫెన్ సన్ను ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగింది. ఆ సభ్యుడికి డబ్బు అంద చేస్తూ తెలుగుదేశం నాయకులు దొరికిపోవటంతో ఈ ఓటుకి నోటు కేసు బాగా ప్రాచుర్యం పొందింది. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి స్వయంగా రూ.50 లక్షలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన్ని కోర్టు ముందు హాజరు పరిచి, జైలుకి కూడా పంపించటం జరిగింది. అమ్ముడుపోయిన అదే నామినేటెడ్ శాసన సభ్యునితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫోన్ సంభాషణ కూడా బయటకు వచ్చింది. దాంతో ఈ కేసులో ఆయనకు కూడా సంబంధముందని బయటకొచ్చింది. అయితే ఈ కేసులో సరిపోయినంత సాక్ష్యాలు లేనందున రేవంత్ రెడ్డి, ఇతర ముద్దాయిలకు ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.