ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మరణించినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు, గాయపడ్డవారిని రూ. 2లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అటు సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
కాగా విజయనగరం జిల్లా కంటకపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారని జిల్లా కలెక్టర్ తెలిపారు. 8 మంది ప్రయాణికులు మరణించారని.. 32 మంది గాయపడినట్లు రెస్క్యూ టీమ్ గుర్తించింది. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయనగరం జిల్లా ఆస్పత్రుల్లో చేర్పించారు. కలెక్టర్, ఎస్పీ ఎం.దీపిక, మంత్రి బొత్స సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు సిగ్నల్ లేకపోవడంతో కొత్తవలస డివిజన్లోని అలమండ-కంటకాపల్లి వద్ద పట్టాలపై నిలిచిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. రైల్వే బోర్డు గ్రూప్లోని డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ రైలు ప్రమాదంపై సమాచారం అందించారు. పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. రెస్క్యూ టీమ్లు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయని డీఆర్ఎం తెలిపారు. ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి.రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంగా మారింది. చీకటి కారణంగా సహాయక చర్యలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పరిస్థితి తీవ్రంగానే ఉంది.
ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి.. సెమీస్లోకి అడుగుపెట్టిన టీమిండియా