Sunday, May 19, 2024

దేశంలోనే అతిపెద్ద స్టెమ్ సెల్ ల్యాబ్ మన హైదరాబాద్‎లో

spot_img

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు మరో పెట్టుబడి రానున్నది. స్టెమ్ క్యూర్స్ కంపెనీ హైదరాబాద్‎లో తమ ల్యాబ్‎ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ల్యాబ్ ప్రధానంగా స్టెమ్ చికిత్సపై దృష్టి సారిస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీమ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. దాదాపు 54 అమెరికన్ మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ తయారీ యూనిట్‎తో 150 మందికి పైగా ఉద్యోగ ఉపాది అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కే. తారక రామారావుతో స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరాం అట్లూరి బోస్టన్ నగరంలో సమావేశం అయ్యారు. అమెరికాలో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని భారతదేశానికి తీసుకువచ్చి తీవ్రమైన వ్యాధులకు స్టెమ్ సెల్ ఉత్పత్తులతో చికిత్సను అందించడమే ఈ కంపెనీ లక్ష్యం. ప్రపంచ మెడికల్ ఇన్నోవేషన్‎కు తన సొంత నగరమైన హైదరాబాద్.. హబ్‎గా మారిందని సాయిరాం అట్లూరి సంతోషం వ్యక్తం చేశారు. తమ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

స్టెమ్ క్యూర్స్ కంపెనీని హైదరాబాద్‎కు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కే.తారక రామారావు తెలిపారు. కంపెనీ పెట్టుబడి ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సంస్థకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో పరిష్కారం లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మనదేశంలో విస్తృతంగా అందుబాటులోకి రావాలన్నారు. స్టెమ్ క్యూర్ సంస్థ ఏర్పాటుచేయనున్న ల్యాబ్‎తో దేశంలో ఈ చికిత్స విధానాలు అందరికి అందుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

Latest News

More Articles