న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా మహిళా రెజ్లర్ల పట్ల కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాగించిన దాష్టీకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలు మోదీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన క్రీడాకారుల పట్ల వ్యవహరించే తీరు ఇలాగేనా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
దేశానికి పతకాలు సాధించి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ఆడబిడ్డలను నడిరోడ్డుపై ఈడ్చిపారేస్తుంటే ప్రధాని మోదీకి రాత్రి నిద్ర ఎలా పట్టిందని మండిపడ్డు. పతకాలు తెచ్చినప్పుడు వారితో ఫొటోలు దిగి.. ఇప్పుడు దౌర్జన్యానికి ఎలా దిగారని నిలదీశాయి. ఇప్పటికైనా మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. జంతర్మంతర్ వద్ద రెజ్లర్లు మళ్లీ ఆందోళన చేసేందుకు అనుమతి ఇచ్చేది లేదని న్యూఢిల్లీ డీసీపీ వెల్లడించారు. రెజ్లర్ల దీక్షా శిబిరం తొలగింపు నేపథ్యంలో.. ఢిల్లీ-హర్యానా సరిహద్దుకు రెజ్లర్ల పోరాట స్థలిని మార్చే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. మరోవైపు పోలీసు వాహనాల్లో రెజ్లర్లకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన వారిపై సాక్షి మాలిక్ మండిపడ్డారు.