రైతులకు ఇది ఒక గొప్ప శుభవార్త. పెరిగిన డీజిల్ ధరల నుంచి ఉపశమనం లభించనుంది. రైతుల కోసం బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఒక వినూత్న ట్రాక్టర్ ను కనిపెట్టారు. ఈ ట్రాక్టర్ కు డీజిల్ అవసరం లేదు. రైతుల బావుల వద్ద లభించే ఆవు పేడతోనే నడవటం విశేషం. అవును.. ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ను తయారు చేసి బ్రిటిష్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ (ప్యుజిటివ్ మీథేన్)గా మార్చారు. ట్రాక్టర్కు ఒక క్రయోజెనిక్ ట్యాంక్ను అమర్చి, ద్రవ రూపంలోని ఈ ఇంధనాన్ని మండించారు. ఆ ఇంధనంతో 270 బీహెచ్పీ సామర్థ్యం గల ట్రాక్టర్ను విజయవంతంగా నడిపినట్టు వివరించారు. డీజిల్ స్థాయి ట్రాక్టర్లతో సమానంగా ఇది పనిచేసిందని, తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసిందని పేర్కొన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్ దాదాపు 160 డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసి బయోమీథేన్ను ద్రవరూపంలో ఉండేలా చేస్తుందని తెలిపారు. ఈ ట్రాక్టర్ను కార్నిష్ కంపెనీ బెన్నామన్ తయారు చేసింది. ఈ ట్రాక్టర్ అందుబాటులోకి వస్తే రైతులకు భారీగా లాభం చేకూరనుంది.