జంటనగరాల రోడ్లపై ఇక కొత్తగా ఎలక్ట్రిక్ సిటీ బస్సులు పరుగులు తీయనున్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా మొత్తం 1,300 ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తీసుకుని రావడానికి అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. కాలుష్యాన్ని నివారించడం, ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ వసతిని కల్పించడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపించనున్నారు. తొలి దశలో భాగంగా త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వివిధ మార్గాల్లో నడిపించనున్నారు.
ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ తయారు చేసిన 550 ఎలక్ట్రిక్ బస్సులకు తాము ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 500 బస్సులను హైదరాబాద్ సిటీలో నడిపిస్తామని వివరించారు. మరో 50 బస్సులను హైదరాబాద్- విజయవాడ రూట్లో అందుబాటులోకి తెస్తామని సజ్జనార్ అన్నారు. విజయవాడ రూట్లో ఇప్పటికే 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని గుర్తు చేశారు. మరో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని, వాటిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఐటీ కారిడార్ ప్రవేశపెడతామని చెప్పారు.