Saturday, May 18, 2024

పెంపుడు కుక్కల కోసం గొడవ.. కాల్పుల్లో ఇద్దరు మృతి

spot_img

పెంపుడు కుక్కల కోసం జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకున్నది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన రాజ్‌పాల్‌ రజావత్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లాడు. అదే సమయంలో రాజ్‌పాల్‌ ఇంటి పక్కనే ఉండే విమల్‌ ఆమ్చా కూడా తన పెట్‌ డాగ్‌ను తీసుకొచ్చారు.

ఈ క్రమంలో రెండు కుక్కలు ఘర్షణపడ్డాయి. అదికాస్త ఇద్దరు యజమానుల మధ్య గొడవకు దారి తీసింది. ఆవేశానికి లోనైన సెక్యూరిటీ గార్డ్‌ రాజ్‌పాల్‌‌.. తన ఇంట్లోకి వెళ్లి బాల్కనీ నుంచి విమల్‌ కుటుంబంపై లైసెన్స్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇందులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. నిందితుడితోపాటు అతని కుమారుడు సుధీర్‌, బంధువు శుభ్‌మన్‌ను అదుపులోకి తీసుకున్నారు. గన్‌ లైసెన్స్‌ను రద్దుచేసి, అతనిపై హత్యకేసు నమోదు చేసినట్టు డీసీపీ అమరేంద్ర సింగ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Latest News

More Articles