హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని హైదరాబాద్తోసహా పలు జిల్లాల్లో వర్షం కురుస్తున్నది. జగిత్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హనుమకొండ జిల్లా, భూపాలపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో తేలికపాటి వర్షం పడుతున్నది.
భారీ వర్ష సూచన
మరోవైపు రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నదని… రాగల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అత్యవసర మానిటరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.