ఓ విద్యార్థి తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అతనిపై దాడి చేశారు. బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో వెలుగు చూసింది.
Read Also: హైదరాబాద్లో 8 కరోనా కేసులు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..
ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ పార్కులో సదరు విద్యార్థి తన స్నేహితులతో కలిసి కూర్చున్నాడు. డబ్బులు తీసుకున్న ఫ్రెండ్ తన నలుగురు సహచరులతో కారులో పార్కు వద్దకు చేరాడు. అనంతరం అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని మౌరానిపూర్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడున్న ఇద్దరు, కారులో ఉన్న నలుగురు కలిసి.. ఆ విద్యార్థికి బలవంతంగా మద్యం తాగించారు. డబ్బులు అడుగుతావా..? అంటూ అతనిపై విరుచుకుపడ్డారు. బట్టలూడదీసి తమ వద్ద ఉన్న బెల్ట్లు, కర్రలతో చితకబాదారు. ఆ తతంగాన్ని అంతా తమ ఫోన్లలో చిత్రీకరించారు. గంట పాటు వేధించిన తర్వాత.. ఆ దుండగుల నుంచి బాధిత బాలుడు తప్పించుకున్నాడు.
Read Also: తమ్ముడికి కిడ్నీ దానం చేసిన భార్యకు తలాక్ చెప్పిన భర్త
ఈ వీడియోలు రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, బాధిత బాలుడు తన పేరెంట్స్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో కొంత మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.