అమెరికాలో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు భారత సంతతికి చెందిన యువకుడు జూడ్ చాకో (21)ను అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఫిలడెల్ఫియా నగరంలో చోటుచేసుకుంది. జూడ్ తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. వారు 30 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. కాగా.. విద్యార్థి అయిన జూడ్ స్థానికంగా పార్ట్టైం ఉద్యోగం చేస్తున్నాడు. రోజూవారిలాగానే ఆదివారం కూడా విధులు ముగించుకొని తిరిగొస్తున్న జూడ్ మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. దోపిడీ చేసే క్రమంలో అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జూడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆంధ్రప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల విద్యార్థి సాయీశ్ వీరా దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఓహాయోలోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న సాయీశ్ మీద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడటంతో అతడు మరణించాడు. ఇలా వరుసగా భారత సంతతికి చెందిన వారు మరణిస్తుండడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.