పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. విద్యుత్ ఘాతంలో నగదు, బంగారం, వెండి, కొత్త బట్టలు కాలి బూడిదయ్యాయి. మరో రెండు వారాల్లోనే పెళ్లి ఉందనగా ఈ ఘటన జరగడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు చూస్తే కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో ఈ ఘటన సోమవారం జరిగింద. గ్రామానికి చెందిన మోహన్ రావు, నరసారావుల ఇంట్లో వారి చెల్లెలు పెళ్లి కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.
ఇంత కాలం పొదుపు చేసిన సొమ్ము,ఇతరుల దగ్గర అప్పులు చేసి, పెళ్లి ఖర్చు కోసం సుమారు రూ. 15లక్షల నగదు. 10 తులాల బంగారం, వెండి నగలు, పట్టుచీరలు, ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. బీరువా ఉన్న గదిలో షార్ట్ సర్య్కూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుటుంబసభ్యులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు ఎగసిపడటంలో బయటకు పరుగులు తీశారు. వారి కళ్ల ఎదుటే పెళ్లి సామాగ్రి కాలి బూడిదయ్యింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో..ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్ మంటలను ఆర్పేసింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
ఇది కూడా చదవండి: త్వరలోనే కార్తీకదీపం- 2…డాక్టర్ బాబు, వంటలక్క కూడా ఉన్నారా?