ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులోని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి మాట్లాడటానికి ఆయన భార్య సునీత కు జైలు అధికారులు అనుమతిని ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆప్ నేత ఆతిశీకి అనుమతినిచ్చిన నేపథ్యంలో… సునీత అభ్యర్థనను మాత్రం తిరస్కరించామని జైలు అధికారులు చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఇదిలా ఉండగా … భర్త అరెస్టు నేపథ్యంలో సునీత ప్రచారంలోకి దిగారు. ఢిల్లీలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఢిల్లీ మంత్రి ఆతిశీ ఇవాళ(సోమవారం) సీఎం కేజ్రీవాల్ తో మాట్లాడనున్నారు. ఇక, పంజాబ్ సీఎం భగవంత్మాన్ రేపు(మంగళవారం) తిహార్ జైలుకు వెళ్లి కేజ్రీవాల్ను కలవనున్నారు. దీంతో మంగళవారం తర్వాతే సునీతను అనుమతించనున్నట్లు జైలు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, జైల్లో ఉన్న వ్యక్తితో ఒకేసారి ఇద్దరు మాట్లాడే వీలుందని, అయినప్పటికీ తిహార్ అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల భగవంత్ మాన్.. కేజ్రీవాల్ను కలిసినప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రితో పాటు ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాథక్ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే సునీతను జైలు అధికారులు అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనీ బీజేపీ కుట్ర