యాదవ, కురమల ఆత్మ గౌరవ భవనాలను త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దాదాపు అన్ని కులాల భవనాలకు ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా బంజారా భవన్ ను ఇప్పటికే ప్రారంభించారు. ఇక త్వరలోనే యాదవ, కురుమల ఆత్మగౌరవ భవనాలను పూర్తి కానున్నాయి. కోకాపేటలో నిర్మిస్తున్న యాదవ భవనం నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు నోముల భగత్, జైపాల్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కలెక్టర్ అమయ్ కుమార్, సీఈ అనిల్ కుమార్, యాదవ సంఘం నాయకులు చింతల రవీందర్ యాదవ్ తదితరులతో కలిసి భవనాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తలసాని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 41 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలకోసం స్థలాలను కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. యాదవ, కురుమ భవనాల నిర్మాణం కోసం ఒక్కో దానికి ఐదెకరాల భూమి, రూ.5 కోట్లు ఇవ్వటం జరిగిందన్నారు. రాజకీయంగా, సామాజికంగా గొల్ల, కురుమలకు పెద్దపీట వేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఐదుగురికి ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ, కార్పోరేషన్ చైర్మన్ చైర్మన్లుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా బీఆర్ఎస్ అవకాశం కల్పించిందన్నారు.