నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. ప్రస్తుతం చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది. మంగళవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదైంది.