అప్పులు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక, ఇల్లు గడవక, ఈఎంఐల పోరు పడలేక వరుసగా తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసింది. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ మాటలని ప్రజలు ఎవ్వరు నమ్మటం లేదు. ప్రభుత్వంపై 30రోజులుగా నిరసనలు తెలుపుతున్న ఆటో డ్రైవర్లకు భరోసా కలగటం లేదు. అందుకే ఇక బతుకు బండి లాగలేక ఒక్కొక్కరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
తెలంగాణలో ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వంలో ఒక్కడు పట్టించుకునే నాథుడే లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక విదేశీ పర్యటనలు చేస్తూ జల్సాలో మునిగితేలుతున్నాడు. లండన్ లో టీడీపీ సానుభూతిపరులు ఏర్పాటు చేసిన పార్టీల్లో అహంకారంతో స్పీచులు ఇస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఇక హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటోడ్రైవర్లకు అండగా ఉంటామని ప్రకటించినా, ఆయన మాటలు, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం తెలంగాణవ్యాప్తంగా 40 రోజులలో 9 మంది ఆటోడ్రైవర్లు మృత్యువాతపడ్డారు. సైఫాబాద్ పీఎస్ పరిధిలోని మక్తాకు చెందిన హమీద్(29), బీఎస్ మక్తాకు చెందిన సతీశ్గౌడ్, మెదక్ జిల్లాలోని కూచన్పెల్లికి చెందిన నర్సింహాగౌడ్, స్టేషన్ ఘన్పూర్ కి చెందిన వేముల సత్యనారాయణ, భయ్యాలాల్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ అనిల్కుమార్, ఇల్లందుకు చెందిన అక్బర్(26), బండ్లగూడ జాగీర్ లో ఆటో కొన్న రాహుల్, నాగర్కర్నూల్ జిల్లా గగ్గలపల్లికి చెందిన ఎస్కే గులాం (44) వంటి మరెందరో ఆటోడ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షానికి ఆత్మహత్యలు చేసుకున్నారు.