యాదాద్రి భువనగిరి: అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కొనియాడారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నేతన్నల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. మాది కోతల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం. 2001లో భూదాన్ పోచంపల్లిలో నేతన్నలను కాపాడుకునే ప్రయత్నం చేశామని కేటీఆర్ వివరించారు.
నేతన్నల ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉంది. ఉప్పల్లో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తుంది. పోచంపల్లి చేనేత కళాకారులు భాగస్వాములై వినియోగించుకోవాలి. నేత కార్మికులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు 22 ఎకరాల్లో ఉంది. దాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తాం. దాంట్లో వచ్చే లాభాలను మీ పోచంపల్లి మండలంలోని ప్రతి నేత కుటుంబానికి అందిస్తాం. ఆ ఓనర్షిప్ను మీకే అప్పజెప్తాం. వ్యవసాయం తర్వాత చేనేత రంగం అధిక మందికి ఉపాధి కల్పిస్తుందని వివరించారు.