యాదాద్రి భువనగిరి: తెలంగాణ చేనేత హెల్త్ కార్డు ద్వారా ఓపీ సేవల కోసం రూ. 25 వేలు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. మగ్గాలు ఆధునీకరించుకోవాలి. గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ లూమ్స్ తీసుకొస్తున్నాం. దీన్ని రూ. 40 కోట్లతో చేనేత మగ్గం అనే కార్యక్రమం కింద తీసుకొచ్చాం. ఇవన్నీ మీ కోసం తెచ్చిన పథకాలు.. వాడుకుంటే మీకే లాభం అని కేటీఆర్ వివరించారు.
మగ్గాలు నేసే నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డు ద్వారా.. పథకాల ప్రయోజనాలు పొందుతారు. గతంలో ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే దహనసంస్కారాల నిమిత్తం టెస్కో నుంచి రూ. 5 వేలు అందించేవారు. కానీ ఇప్పుడు రూ. 25 వేలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.