ఆఫ్రికాలోని మరో దేశం గాబన్లో సైనిక తిరుగుబాటు జరిగింది. అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా తాజా ఎన్నిక చెల్లదంటూ అన్ని అధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు ఆ దేశ సైన్యం. అధ్యక్షుడిని గృహ నిర్బంధంలో ఉంచి ఆయన తనయుడిని రాజద్రోహం కేసులో అరెస్టు చేశారు.
అన్ని రిపబ్లిక్ సంస్థలను, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ సరిహద్దులను తమ అధీనంలోకి తీసుకున్నారు. అలీ బొంగో 2009 నుంచి ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత 55 ఏళ్లుగా గాబన్ను వారి వంశస్థులే పాలిస్తున్నారు.
శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బొంగో 64.27 శాతం మెజారిటీతో మూడోసారి గెలిచినట్లు స్థానిక మీడియా తెలిపింది. దాంతో ఆగ్రహించిన విపక్ష నేత ఆల్బర్ట్ ఆండో ఒస్సా అవి తప్పుడు ఫలితాలని ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం సైన్యం అధికారాలను హస్తగతం చేసుకున్నది.
ఇటీవలి కాలంలో ఆఫ్రికా దేశాల్లో సైనిక తిరుగుబాట్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మాలి, గినియా, సూడాన్, బుర్కినా ఫాసో, నైగర్ దేశాల్లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే.