హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని టైంటేబుల్ను ప్రకటించనుంది. పార్లమెంట్ ఎన్నికలు, ఇతర జాతీయ పరీక్షల నేపథ్యంలో పరీక్షలకు, ఫలితాల ప్రకటనకు ఇబ్బంది లేకుండా ఈసారి కొంత ముందుగా పరీక్షలను పెట్టాలని బోర్డు భావిస్తుంది.
ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడత ఎగ్జామ్స్ ఉన్నాయని, ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు ఉంటే విద్యార్థులు సన్నద్ధమవడానికి వీలవుతుందని బోర్డు అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొన్నారు.