న్యూఢిల్లీ: ఓయో బుకింగ్స్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్ఫామ్ ఓయో (OYO) ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది అత్యధిక బుకింగ్స్ నమోదైన నగరంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరు, దిల్లీ, కోల్కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇక టూరిస్ట్ ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలవగా.. గోవా, మైసూర్, పుదుచ్చేరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరీ మొదటి ప్లేస్ లో నిలవగా.. అమృత్సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తర్ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఓయో తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు ఓయో నివేదిక పేర్కొంది.
ఈ ఏడాదిలో సెప్టెంబర్ 30న అత్యధిక బుకింగ్స్ నమోదు అయినట్లు నివేదికలో తెలిపారు. అత్యధికంగా బుకింగ్స్ నమోదైన నెలగా మే నెల నిలిచింది. ఇతర లాంగ్ వీకెండ్లతో పోలిస్తే సెప్టెంబర్ 30- అక్టోబర్ 2 మధ్య లాంగ్ వీకెండ్ అత్యధిక బుకింగ్స్ జరిగినట్టు ఓయో నివేదిక పేర్కొంది.