మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ సర్కార్ రైతుల ఖాతాలో రైతుబంధు పైసలు జమ చేయడం ప్రారంభించింది. కాగా, కొందరు రైతులకు రూపాయి అకౌంట్లో పడ్డ సంఘటనలు నమోదు అయ్యాయి. హన్వాడ మండలానికి చెందిన ఓ రైతు కు రైతుబంధు డబ్బులు కేవలం ఒక్క రూపాయి మాత్రమే తన ఖాతాలో జమ అయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు ఏడాదికి రెండుసార్లు ఎకరానికి రూ.10 వేల చొప్పున పడేవని, కానీ ఈ సారి ఈ యసంగికి కేవలం ఒక్క రూపాయి పడిందని పాండురంగా రెడ్డి తెలిపారు.
ఇదే మండలానికి చెందిన టంకర గ్రామానికి చెందిన ఆంజనేయులు రూ. 62 జమ అయినట్లు మెసేజ్ వచ్చిందన్నారు. ఇతనికి గ్రామంలో రెండుగంటల భూమి ఉంది. ప్రతిసారి రూ.250 పడేవని, ఈ సారి కేవలం రూ.62 మాత్రమే వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా చాలా మంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదు. ఒక ఎకరంతో ప్రారంభించి రైతుబంధు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. ఇంకా రైతుబంధు జమ చేయక పోవడంతో యసంగీ సాగుకు ఇక అప్పులు తప్పవేమో అనే ఆందోళన చెందుతున్నారు రైతులు.