ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో జమ్మికుంట తహసీల్దార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెయిడ్ చేశారు. జమ్మికుంటలోని తహసీల్దార్ రజని నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్నటి (మంగళవారం) నుంచి తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రజని నివాసంతో పాటు హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆమె బంధువుల నివాసంలోనూ ఏకకాలంలో తనిఖీ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఎంత నగదు బయటపడింది, రజని ఎన్ని ఆస్తులు కూడబెట్టారు అనే వివరాలను ఏసీబీ అధికారులు బయటపెట్టలేదు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడే వివరాలు చెప్పలేమన్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి మంగళవారం జమ్మికుంటలోని రజని నివాసానికి, హనుమకొండలోని ఆమె బంధువుల ఇంటికి ఏకకాలంలో చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అధికారులు వివరాలు తెలిపే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి:బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై దాడి