యుద్ధ రంగంలో సైన్యానికి ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో యూనిఫాంలను సిద్ధం చేశారు. అయితే వీటిని పోలిని దుస్తులను బహిరంగ మార్కెట్లలో కొందరు అమ్మకాలు మొదలు పెట్టారు. దీంతో దుస్తుల అమ్మకాలపై దాడులు మొదలు పెట్టారు ఆర్మీ అధికారులు. తాజాగా పుణె, అహ్మద్నగర్లోని భింగర్ క్యాంప్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు తనిఖీలు చేపట్టారు. దక్షిణ కమాండ్ సైనిక ఇంటెలిజెన్స్ విభాగం సాయంతో పోలీసులు వీటిని నిర్వహించారు. 40 నకిలీ యూనిఫాంలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాసిక్ జిల్లా వాసి. ఎలాంటి లైసెన్స్లు లేకుండా వీటిని కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారత సైన్యం కోసం సరికొత్త యూనిఫామ్ను 2022 జనవరి 15న ఆవిష్కరించారు. ప్రస్తుతం ఉన్న యూనిఫాంను దీంతో భర్తీ చేస్తున్నారు. దీనిని డిజిటల్ టెక్నాలజీ సాయంతో తయారు చేశారు. ఈ వస్త్రం తేలిగ్గా, బలంగా, గాలి ఆడేట్లు, వేగంగా పొడిగా అయ్యేలా, నిర్వహణకు తేలిగ్గా ఉండేట్లు తయారు చేశారు. ఈ యూనిఫామ్ డిజైన్పై సైన్యానికి 10 ఏళ్లపాటు హక్కులు ఉన్నాయి. ఇప్పటికే 50 వేల జతలు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. వీటిని సరైన విధానంలో కుట్టేలా ఆర్మీ, పౌర దర్జీలకు శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సైనిక దుస్తులను ఎలాంటి అనుమతులు లేకుండా సేల్ చేసేవారిని నిరోధించేందుకే తాజాగా దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిని అక్రమంగా అమ్మడం దళాల భద్రతకు కూడా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. సైన్యం కొత్త యూనిఫాంలపే కేవలం క్యాంటీన్లలోనే కొనుగోలు చేయాలి.
ఇది కూడా చదవండి: పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు