పరీక్షలంటే చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఆ భయంతో వచ్చిన ఆన్సర్లు కూడా మరచిపోతుంటారు. అలా భయపడే విద్యార్థుల భయాన్ని పొగొట్టడానికి కేంద్ర విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా.. పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని పేర్కొంది. విద్యార్థుల్లో పరీక్షల భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుందన్నారు.
Read Also: ఈ రోజే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
‘ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
Read Also: సీఎం కేసీఆర్ గుడ్న్యూస్.. నగదు రహిత చికిత్స కోసం ట్రస్ట్