మయన్మార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడి మిలిటరీ ప్రభుత్వం 7వేల మందికి పైగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. వీళ్లలో మాజీ మంత్రి థుర అంగ్ కో, ప్రముఖ రచయిత తిన్ లిన్ వూ కూడా ఉన్నారు.
కాగా, ఆంగ్ సాన్ సూకీ, మాజీ అధ్యక్షుడు విన్ మియింట్ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో ఉన్నారా లేదా అన్న విషయాన్ని మయన్మార్ ఆర్మీ వెల్లడించలేదు.
తాజాగా క్షమాభిక్ష పొందిన థుర, థిన్ లిన్ ఇద్దరూ.. ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వంలో పనిచేశారు. సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీలో థిన్ లిన్ అధికారిగా విధులు నిర్వహించారు.
ప్రభుత్వంపై కుట్ర పన్నారని, ప్రజలను రెచ్చగొట్టారనే ఆరోపణల మీద తిన్ లిన్కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. రాజకీయ ఖైదీలుగా ఉన్నవాళ్లలో 7,012 మందిని మయన్మార్ సైన్యం జైలు నుంచి విడుదల చేసింది.
మయన్మార్ సైన్యం 2021 ఫిబ్రవరి1న ఆంగ్సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దెదించింది. ఆమెతో పాటు ఇతర అధికారులు, నిరసనకారులను అరెస్ట్ జైలుకు పంపింది. ఆర్మీ అక్కడి పాలన బాధ్యతలను చేపట్టింది.
అయితే, హింసను విడనాడాలని, రాజకీక ఖైదీలను వెంటనే విడుదల చేయాలని గతేడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మయన్మార్ ప్రభుత్వానికి సూచించింది.