లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేస్తున్న సమన్లను గత కొంతకాలంగా తిరస్కరిస్తూ వస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారు. ఈ కేసులో ఈడీ గత నాలుగు నెలలుగా కేజ్రీకి నోటీసులు ఇస్తోంది. ఇప్పటికి ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు.
ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇలా తరచూ నోటీసులు ఇస్తోందంటూ కేజ్రీవాల్ కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో పలు కారణాలు చూపి ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 27న కేజ్రీవాల్కు ఈడీ అధికారులు ఎనిమిదో సారి కూడా సమన్లు పంపారు. మార్చి 4వ తేదీన విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, ఈ సారి కూడా విచారణకు హాజరుకాలేనని కేజ్రీ ప్రకటించారు.
అయితే, మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని తెలిపినట్లు తెలిసింది. ఈ మేరకు తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో సీఎం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని ఆరోపించిన కేజ్రీవాల్.. వారి ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని సీఎం స్పష్టం చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్