దేశంలో బియ్యం కొరత ఏర్పడి, ధరలు ఆకాశాన్నంటడంతో ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరిట కిలో బియ్యాన్ని కేవలం రూ. 29లకే విక్రయించాలని నిర్ణయించింది. ఈ సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే గోధుమపిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో తక్కువ ధరలకే అందిస్తున్నారు. అయితే ఇది నిజంగా పేదల కోసం తీసుకున్న నిర్ణయమా లేక లోకసభ ఎన్నికల స్టంటా అని సామాన్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.