మతాల మధ్య పంచాయతీ పెట్టి పబ్బం గడుపుకోవటమే బీజేపీ పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. అది అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని…దాని ఉచ్చులో పడొద్దని యూత్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని హుజుర్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పై నిప్పులు చెరిగారు. కేంద్రమంత్రి పదవిలో ఉన్న కిషన్ రెడ్డి ఓ సన్నాసి అని ఆయన మాట్లాడేవన్నీ అబద్దాలేనని చెప్పారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకపోతే మాట్లాడలేని దద్దమ్మలు రాష్ట్ర బీజేపీ నేతలని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోయినా సరే…సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా వపర్ ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
దేశానికే తెలంగాణ వేగుచుక్క
అసలు దేశానికే తెలంగాణ వేగుచుక్కగా మారిందని కేటీఆర్ అన్నారు. ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు పంచుతుందన్నారు. ఇక తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కానీ బీజేపీ మాత్రం ప్రజలకు చేసేందేమీ లేదని విమర్శించారు. మోడీ పాలనలో బాగుపడింది కేవలం కార్పొరేట్ శక్తులేనన్నారు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని భావిస్తున్న బీజేపీని తరమికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.