తల్లిదండ్రులు చూస్తుండగానే ఓ చిన్నారి బావిలో పడి చనిపోయిన విషాద ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన బాగెల్, రజినిలు భార్యభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నెక్కొండకు వచ్చారు. అక్కడ పానీ పూరీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కార్తీక్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా.. శుక్రవారం ఉదయం కార్తీక్ ఆడుకుంటూ వెళ్లి ఇంట్లోని చేదబావి మీదున్న రేకుల మీదకు ఎక్కాడు. అయితే ఆ రేకులు పాతవి కావడంతో, అవి పగిలి బాబు బావిలో పడిపోయాడు. గమనించిన తల్లి వెంటనే గట్టిగా అరవడంతో.. తండ్రి వచ్చి వెంటనే తాడు సాయంతో బావిలోకి దిగాడు. కానీ అప్పటికే కార్తీక్ నీళ్లలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని బయటకుతీశారు. అప్పటివరకు తమ కళ్ల ముందే ఆడుకున్న కొడుకు.. అచేతన స్థితిలో పడి ఉండటంతో ఆ తల్లిదండ్రుల రోదన ఆకాశన్నంటుతోంది.