కరీంనగర్: తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.
ఆటోరిక్షా పోరగాళ్లు ఉన్నరు. వాళ్లకు నేను ఇవాళ శుభవార్త చెబుతున్నాను. వారికి ఆదాయం వచ్చే తక్కువ. నరేంద్ర మోదీ విపరీతంగా డీజిల్ ధర పెంచేటట్టు చేసిండు. దేశవ్యాప్తంగా ఆటో రిక్షా కార్మికుల దగ్గర ముక్కుపిండి పన్ను వసూలు చేస్తరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాంగనే పన్ను రద్దు చేసిన. రూపాయి పన్ను లేదు. ఇప్పుడు వాళ్లకు ఏం బాధ ఉన్నదంటే. సంవత్సరానికి కోసారి ఫిట్నెస్ చేయించుకోవాలి. ఆ ఫిట్నెస్కు వెళితే రూ.700 ఛార్జి చేస్తరు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.500 ఛార్జీ వేస్తున్నరు. మొత్తం కలిపి రూ.1200 అవుతుంది. ఈ సారి బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఫిట్నెస్ పన్నును రద్దు చేస్తమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.