Monday, May 20, 2024

గీత కార్మికులకు సీఎం శుభవార్త.. త్వరలోనే ‘గీత కార్మికుల బీమా’

spot_img

కల్లుగీత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కల్లు గీత కార్మికులు చెట్టు మీది నుంచి పడి చనిపోతే.. ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా.. కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించి డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులు పాల్గొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని మంత్రులు శ్రీనివాస్ గౌడ్‎, హరీశ్ రావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోయే దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సీఎం అన్నారు. ఇప్పటికే ఎక్స్‎గ్రేషియా అందిస్తున్నా.. బాధితులకు అందడంలో ఆలస్యమవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా మాదిరిగానే.. కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Latest News

More Articles