Wednesday, May 8, 2024

జూ. ఎన్టీఆర్‎ను కలిసిన మంత్రి పువ్వాడ

spot_img

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‎ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేయనున్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఈ విగ్రహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‎తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‎ను హైదరాబాద్‎లోని ఆయన నివాసంలో కలిసి విగ్రహావిష్కరణ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ నేపథ్యంలో మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్‌ విగ్రహం పర్యాటకులను ఆకర్షించనుంది. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపుకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ నందు ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు, వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయంతో ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. విగ్రహ నిర్మాణానికి కావాలసిన నిధులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Latest News

More Articles