రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన మెట్రోలైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ను మార్చుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాతబస్తీలోని ఫలక్నుమా లేదా ఎల్బీనగర్ నుంచి శంషాబాద్కు మెట్రో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్కు మెట్రోరైల్ మార్గాన్ని మార్చాలని నిర్ణయించామని తెలిపారు. ఫలక్నుమా మీదుగా శంషాబాద్కు వెళ్తే దగ్గరి దారి అవుతుందని, నిర్మాణ ఖర్చు తగ్గుతుందని చెప్పారు.
Read Also: బండి సంజయ్కి షాకిచ్చిన సొంత నియోజకవర్గ నేతలు
అలాగే టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు జరిగిన తీరు సహా అన్ని విషయాలపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయాల్సి ఉన్నదని, అందులో సమగ్ర సమాచారాన్ని అందజేస్తామని చెప్పారు. ధరణిపై అధికారులతో సమీక్ష నిర్వహించి 35 మాడ్యూల్స్పై సమగ్రంగా చర్చించామని అన్నారు. వీటిపై అధికారుల వద్ద సరైన సమాచారం లేదని, సమస్త వివరాలతో రావాలని ఆదేశించినట్టు వెల్లడించారు. అధికారులు పూర్తి సమాచారంతో వచ్చిన తర్వాత సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.