హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియంతృత్వ పోకడలు మితిమీరుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై మోదీ తీరును విపక్షాలు ఎండగడుతున్నాయి. 2020 డిసెంబరు 10న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన మోదీ.. వీర్ సావర్కర్ 140వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28న పార్లమెంటు భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అసలు పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అధికారం ప్రధానికి ఉందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కూడా ఇదే విషయమై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రాజ్యాంగంలోని 79వ అధికరణం ప్రకారం.. కార్యనిర్వాహక, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలపై రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉంటాయి.
ఈ విధంగా చూసినా కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుందని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. తన ఇమేజీని పెంచుకునేందుకు మోదీ తహతహలాడటంపై ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు.
తెలంగాణలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టే సచివాలయ ప్రారంభానికి గవర్నర్ ని పిల్వలేదని తెలంగాణ సమాజానికి తెలుసు. గవర్నర్ వ్యవస్థను రాజకీయం చేసిన బీజేపీ.. ఇక్కడ ప్రజా ప్రభుత్వంతో పేచీ పడుతూ.. అడుగడుగునా అభివృద్ధికి అడ్డం పడుతున్న విషయం తెలంగాణలో ఎవరిని అడిగిన చెబుతారు. ఆ పరిస్థితుల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రథం పౌరురాలని కార్యక్రమానికి దూరంగా పెట్టారనేది జగమెరిగిన సత్యం.