ఎంతో సంతోషంగా విహారయాత్రకు వెళ్లిన వెళ్లిన విద్యార్ధులు ప్రమాద వశాత్తు జరిగిన కారు ప్రమాదంలో చనిపోయారు. విద్యార్థుల విహారయాత్ర వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ముస్సోరి – డెహ్రాడూన్ మార్గ్ ఝడిపానీ రోడ్లోని పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.
డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు విహార యాత్ర కోసం ముస్సోరి వెళ్లారు. ఇందులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో నాన్సీ అనే యువతి తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోంది