మేడ్చల్: సీఐఎస్ఎఫ్ లో రెండేళ్ల క్రితం విధుల నుండి తొలగించబడిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కావుకూరులోని అడవీ ప్రాంతానికి ఓ జవాన్ యూనిఫామ్ వేసుకుని వచ్చి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రవీందర్ ను విధుల నుండి తీసివేయడంతో మనస్థాపానికి గురై ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రవీందర్ మరణానికి గల మరిన్ని కారణాలను పోలీసులు అన్ని కోణాలలో విశ్లేషిస్తున్నారు. అతను చనిపోయిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.