కాంగ్రెస్ పార్టీ మాజీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. ప్రగతి భవన్లో సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నాగం జనార్దన్రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఆయన నివాసంలో కలిసి సమావేశమై బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ను కలిసి తర్వాత ముహూర్తం నిర్ణయించుకొని బీఆర్ఎస్లో చేరనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. అయితే, ఆయన నాగర్ కర్నూల్ టికెట్ ఆశించగా.. పార్టీ ఆయనకు మొండి చేయి చూపింది. ఈ క్రమంలో అనుచరులతో భేటీ అయ్యారు. అనుచరుల కోరిక మేరకు కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎంను నాగం కలువడం ప్రాధాన్యం సంతరించుకున్నది.