బీఆర్ఎస్ను వీడిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఉన్న సమయంలో కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి ఎన్టీఆర్కు ఇష్టం లేకపోయినా బ్రతిమిలాడి ఇప్పించానని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ లో చేరిన సమయంలో కూడా తానే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా చేశానని అన్నారు ఎర్రబెల్లి. అంతేకాదు మంత్రి పదవి వచ్చేలా చేసింది కూడా తానేనన్నారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహరికి ఏం తక్కువ చేయలేదని.. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశాలు ఇచ్చింది పార్టీయేనని తెలిపారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఎన్నో అవకాశాలు కల్పించిన తల్లి లాంటి పార్టీకి కూతురు కోసం తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్లో చేరడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ప్రతి ఎన్నికల్లో కడియం గెలుపునకు కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశ వాదులకు ప్రజలు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎర్రబెల్లి.
ఇది కూడా చదవండి: రైతాంగానికి ధైర్యం ఇచ్చే సత్తాలేని పిరికివాళ్లు కాంగ్రెస్ మంత్రులు